హైదరాబాద్: ప్రజా ఉద్యమాలకు గద్దర్ చిరునామాగా నిలిచారని, పీడిత ప్రజల గొంతుకగా తన ఆట, పాటలతో కోట్లాది మందిని ఉద్యమం వైపు నడిపించిన మహనీయుడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొనియాడారు. “ప్రజా యుద్ధ నౌక గద్దర్” డాక్యుమెంటరీ పోస్టర్ను మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గద్దర్ అన్న అంటే తనకు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సినీ అవార్డులను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
గద్దర్ జీవితంలోని ఉద్యమ ప్రస్థానం, ఆయన పోరాట స్ఫూర్తితో పాటు భావితరాలకు తెలియని ఎన్నో అంశాలను డాక్యుమెంటరీ ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.గద్దర్ ఆశయాలను, ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.

