* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* పెద్దపల్లి బైపాస్ రోడ్డు, కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి భూ సేకరణ వేగవంతం చేయాలి
* అక్టోబర్ 15 వరకు కునారం ఆర్ఓబీ పూర్తి చేయాలి
* భూ సేకరణపై రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ సమస్యలను పరిష్కరించాలి
పెద్దపల్లి : అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములతో కలిసి అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ భూ సేకరణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి బైపాస్ రోడ్డు, కూనారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, తదితర అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని సూచించారు.
భూ యజమానులకు సంబంధించిన సమస్యలు, భూ వివరాల పరిశీలన, రికార్డుల పరిశీలన, పరిహారం చెల్లింపులు తదితర అంశాలను వేగవంతం చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులకు భూ సేకరణ కీలకమైనందున, పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణీత లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు.
భూ సేకరణ సజావుగా జరిగేలా అవసరమైన చోట భూ యజమానులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనుల పురోగతికి భూ సేకరణ కారణంగా ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కూనారం ఆరోబీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అక్టోబర్ 15 నాటికి రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేసి వాహనాల రాకపోకలు జరిగే విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ. భావ్ సింగ్ , రెవెన్యూ డివిజనల్ అధికారులు బి. గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

