◆ భూత్పూర్ పీఎస్ తనిఖీలో ఎస్పీ డి.జానకి
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం భూత్పూర్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి మరియు సిబ్బంది పనితీరును సమీక్షించిన ఎస్పీ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలన్నారు.
NH-44 జాతీయ రహదారిపై ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర నిఘా ఉంచాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాత్రి గస్తీని మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ నాగన్న తదితరులు పాల్గొన్నారు.

