ఉట్నూర్: ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంలో నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని అన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గుడిసెలు లేని గ్రామాలను చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.
ప్రతి అర్హుడికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్పష్టం చేశారు.
లక్కారం గ్రామంలో ఇప్పటికే చాలా వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
గ్రామంలోని చెరువును మినీ ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ లక్కారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.

