* రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
* అన్నదమ్ములకు హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసుల పిలుపు
సిరిసిల్ల: రక్షాబంధన్ వేడుకల సందర్భంగా సిరిసిల్ల ట్రాఫిక్ పోలీసులు నేతాజీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే సమయంలో సీట్బెల్ట్ వినియోగించాలని సూచించారు. అతివేగంగా, రాంగ్రూట్లో వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించవద్దని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నివారించాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు తమ కుటుంబ సభ్యుల భద్రతను కూడా కాపాడుకోవచ్చని శ్రీనివాస్ తెలిపారు.
అన్నదమ్ముల భద్రతకు హెల్మెట్ బహుమతి:
రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ అనుబంధంతో పాటు రోడ్డు భద్రత పట్ల కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అక్కచెల్లెళ్లు రక్షాబంధన్ సందర్భంగా తమ అన్నదమ్ములకు హెల్మెట్ను బహుమతిగా ఇచ్చి, వారు వాహనం నడిపే ప్రతిసారి తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని కోరారు.

